ఊహించినట్టుగానే ఉచితమైన రీతిలోనే సకల జనుల సమ్మె 42 రోజుల తర్వాత విరామం తీసుకుంది.
విరమణ అన్నా, విరామం అన్నా వాస్తవంగా వర్తమాన ప్రభావంలో పెద్ద తేడా ఏమీ వుండదు.
రాజకీయ నాటకాలతో ఉత్పన్నమైన సమస్యలకు సంక్షోభాలకు ఉద్యోగుల సమ్మెలు పరిష్కారం చూపించలేవని ఈ బ్లాగులో రాయడమే గాక ఇతరత్రా కూడా స్పష్టంగానే చెబుతూ వచ్చాను.
ఇది సమ్మెదార్లను తక్కువ చేయడం కాదు. సవాళ్లు సంక్లిష్టతల తీవ్రతను చెప్పడం మాత్రమే.
వరుసగా వివిధ తరగతులు విరామం తీసుకోవడం అనివార్యమైన పరిణామం.
ఈ వాస్తవాన్ని గుర్తించడంలో ఎవరూ ప్రతిష్టలకు పోనవసరం లేదు. అలాగే విరమించారు గనక విఫలమైనారని ఇతరులు భావించనవసరం లేదు.
ఇలాటి విషయాల్లో జయాపజయాల లెక్కల కన్నా జన హితమే కొలబద్దగా పెట్టుకోవాలి.
అయితే ఉద్యోగులైనా విద్యార్థులైనా రాజకీయ వాస్తవాలను ప్రాంతాల వారీ కోర్కెల పరిమితులను కూడా గమనంలోకి తీసుకోవడం అవసరం.
రాజకీయ సమస్యను భావోద్వేగ భరితంగా మార్చి చూపించడం స్వార్థపర శక్తులకు ఉపయోగం తప్ప విశాల జనబాహుళ్యానికి కాదు.
పాలకులు తల్చుకుంటే రాష్ట్ర విభజన చేయొచ్చు. ప్రస్తుతానికి వారు అలా అనుకోవడం లేదు.
ఆ అవకాశం లేదని కూడా పదే పదే స్పష్టంగానే చెబుతున్నారు. రెండువారాల్లో వచ్చేస్తుందని కెసిఆర్ చెప్పినప్పుడు గాని నవంబరు 1 కి వస్తుందని కోదండరామ్ అన్నప్పుడు గాని అవి ఆధారరహితాలేనని అందరికీ తెలుసు.
వారికి ఇంకా బాగా తెలుసు.సమ్మె విరమణకై విజ్ఞప్తి చేసిన ఆజాద్ వ్యాఖ్యలలో కూడా ఇసుమంతైనా కొత్త దనం లేదు.
అన్నీగత వైఖరి పునరుద్ఘాటనలే. అయినా ఆ ప్రకటన పెద్ద ప్రధానమైందన్నట్టు చూపించడంలో వాస్తవికత శూన్యం.
ఇప్పుడు నిరాహారదీక్షలు అంటున్నారు గాని ఇంత త్వరలో పరిస్థితులు మారిపోతాయిని అనుకోవడానికి ఆస్కారమే లేదు.
కాకపోతే వూపు నిలబెట్టడానికి ఉపయోగపడొచ్చు.
కేంద్ర రాస్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయ ప్రకటన వేగవంతం చేయడమే ఇప్పుడు జరగాల్సింది.
No comments:
Post a Comment