Sep 21, 2011

మల్టీనేషనల్‌ మాయజాలం

commoditiesనాడు సామ్రాజ్య కాంక్షతో దురాక్రమణలకు పాల్పడ్డ విదేశాలు.. నేడు వ్యాపార విస్తరణ పేరుతో స్వదేశీ సంస్థలను ఆక్రమిస్తున్నాయి. డాలర్ల మోజో లేక నిర్వహణ భారమో తెలియదు గానీ దేశం లోని వంటనూనె తయారీ పరిశ్రమలు వరుసగా బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. రాజస్థాన్‌, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, నాగ్‌పూర్‌లలోని సోయా, సన్‌ఫ్లవర్‌ నూనె తయారీ పరిశ్రమలు చాలావరకు ప్రస్తుతం విదేశీ సంస్థ ల హస్తగతమైయ్యాయి. కన్ను పడితే చాలు కొనేసే ధోర ణిని మల్టీ నేషనల్‌ కంపెనీలు అవలంభిస్తున్నాయంటే అర్థం చేసుకో వచ్చూ ఏ స్థాయిలో వాటి మాయాజాలం పనిచేస్తుందో.

అమెరికా సంస్థలే అధికం
ఇలాంటి బహుళజాతి సంస్థల్లో అమెరికా సంస్థలే అధికంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఆర్చర్‌ డానియెల్స్‌ మిడ్‌లాండ్‌ (ఏడీఎమ్‌) ఒకటి. ఈ సంస్థ ఇటీవలి కాలంలో దేశీయ వంట నూనె పరిశ్రమలను వేగవంతంగా ఆక్రమించేసుకుంటోంది. ఈ నెలారంభంలోనే ఏడీఎమ్‌ సంస్థ రాజస్థాన్‌లోని కొట్టా, మహారాష్టల్రోని అకోలా ప్రాంతాల్లోని రెండు నూనె తయారీ పరిశ్రమలను కొనుగోలు చేసేసింది. ఈ రెండు కర్మాగారాలు గీపీ అగ్రి ప్రైవేట్‌ లిమిటెడ్‌కి చెందినవి కాగా మహారాష్టల్రోని లాతూర్‌, కర్ణాటకలోని ధర్వాద్‌ ప్రాంతాల్లోని తిన్నా ఆయిల్స్‌ సంస్థ నుంచీ సోయా, పొద్దు తిరుగుడు నూనె పరిశ్రమలను ఏడీఎమ్‌ దక్కించుకోవడం గమనార్హం. నాగ్‌పూర్‌లోని మధుర్‌ అగ్రోకు చెందిన మరో నూనె తయారీ పరిశ్రమతోపాటు భోపాల్‌ ఆధారిత భాస్కర్‌ గ్రూపునకు చెందిన పరిశ్రమనూ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

ఇందుకు తగ్గట్టుగా ఆయా సంస్థలతో సంప్ర దింపులను ఏడీఎమ్‌ జరుపుతోంది. ఇక ఏడీఎమ్‌ దూకుడు ఇలావుంటే..ఈ ఏడాది మార్చిలో మరికో సంస్థ నుంచి కార్గిల్‌ సంస్థ ప్రీమియం సన్‌ఫ్లవర్‌ బ్రాండ్‌ స్వీకర్‌ను రూ.200 కోట్ల ఒప్పందంలో భాగంగా దక్కించుకుంది. గతేడాది నవంబర్‌ లోనూ ఈ సంస్థ అగ్రో టెక్‌ నుంచి రూ.120 కోట్లతో వనస్పతి బ్రాండ్‌ను చేజిక్కించుకోవడం విశేషం. తాజాగా క్రిందటి వారమే స్విట్జర్లాండ్‌కు చెందిన గ్లెన్‌కోర్‌ అనే బహాళజాతి సంస్థ మధ్యప్రదేశ్‌లోని మోరేనా ప్రాంతంలో నెలకొల్పబడిన కె.ఎస్‌. ఆయిల్స్‌ను టేకోవర్‌ చేసింది. ఇలా ఎన్నో బహాళజాతి సంస్థలు దేశీయ వంటనూనె పరిశ్రమ రంగాన్ని జుర్రేసుకుంటున్నాయి.

ఆందోళనకరమే
బహుళజాతి సంస్థల చేతుల్లోకి ఒక్కొక్కటిగా వంటనూనె పరిశ్రమలు చేరుతుండటం ఆందోళనకరమేనని దేశీయ నూనె పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. సున్విన్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సందీప్‌ భజోరియా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతీయ నూనె పరిశ్రమలను కొనుగోలు చేసేందుకు విదేశీ సంస్థలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాయని మరో సంస్థకు చెందిన ఉన్నతాధికారి పేర్కొన్నారు.

ఇందుకు కారణాలు సైతం లేకపోలేదని సదరు అధికారి అన్నారు. ఏటా భారత్‌ విదేశాల నుంచి 8 టన్నుల నూనెను దిగుమతి చేసుకుంటోందని, ఇందులో 6 మిలియన్‌ టన్నుల వరకూ ముడినూనే ఉంటోందన్నారు. దీంతో భారత్‌ నూనె పరిశ్రమలను తమ అధీనంలోకి తీసుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వేగంగా నూనె తయారు చేసి మరింత లాభాలను ఆర్జించవచ్చని విదేశీ సంస్థలు భావిస్తున్నాయన్నారు. ప్రపంచ మార్కెట్‌లతో పోల్చితే భారతీయ మార్కెట్‌ ఎంతో నమ్మకమైనదిగా, ఒడిదుడుకులు తక్కువగా ఉండి, అమ్మకాలు ఎక్కువగా ఉండటమే దేశీయ నూనె పరిశ్రమల కొనుగోళ్లకు విదేశీ సంస్థలు ఆరాటపడుతున్నాయని అడాని ఎంటర్‌ప్రైజెస్‌ సీఈఓ అతుల్‌ చతుర్వేది అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో అడాని ఎంటర్‌ప్రైజెస్‌, సింగపూర్‌కు చెందిన విల్మర్‌ ఇంటర్నేషనల్‌ సంస్థలు సంయుక్తంగా ఫార్చూన్‌ బ్రాండ్‌ వంట నూనెను తయారు చేస్తున్నారు. అయితే ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్న సంస్థలే అధికంగా విదేశీ సంస్థల అధీనంలోకి వెళ్తున్నాయని రుచీ సోయా ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ స్పష్టం చేస్తోంది. మొత్తానికి దేశీయ వంటనూనె పరిశ్రమలు విదేశీ సంస్థలలో అంతర్లీనం అయిపోతున్నాయి. ఈ విపత్కర పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వస్తుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments: