Sep 21, 2011

సినిమాలకు దూరం కాను

'దసరాబుల్లోడు'లా జీవితకాలం నటిస్తూనే ఉండాలని అక్కినేని నాగేశ్వరరావును అభిమానులు దీవించారు. ఆయన 88వ పుట్టినరోజు వేడుక మంగళవారంనాడు అన్నపూర్ణ స్టూడియోస్‌లో అభిమానుల సమక్షంలో ఘనంగా జరిగింది. పలు ప్రాంతాల నుంచి అభిమానులు వచ్చారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను చూసి దసరాబుల్లోడు అంటూ నినదించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ...'అభిమానుల ఆనందం కొత్త ఉత్సాహాన్నిస్తోంది. నాన్నగారు...నిండునూరేళ్లూ బతకాలని కోరుకుంటున్నా'నని అన్నారు. తమ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన అభిమానులు బాగుండాలని, వారి కుటుంబాలు కూడా బాగుండాలని' అక్కినేని అమల ఆకాంక్షించారు. అమ్మ పేరుతో ఉన్న ఈ స్టూడియోలో ఈరోజు పండుగ వాతావరణ నెలకొందని అభిమానులనుద్దేశించి నాగసుశీల వ్యాఖ్యానించారు. సుమంత్‌, సుశాంత్‌ తదితరులు తాత అక్కినేని గురించి మాట్లాడారు.
అక్కినేని మాట్లాడుతూ...'అభిమానుల ఆదరాభిమానాలే ఇంతటి వాడిని చేసింది. నేను చనిపోయేవరకు సినిమాలు చేస్తూనే ఉంటాను. ఈరోజు రాష్ట్రం అంతా గందరగోళంగా ఉన్నా మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా'నని అన్నారు.
మంగళవారం ఉదయమే నందమూరి బాలకృష్ణ, డి.రామా నాయుడు, అశ్వనీదత్‌వంటి ప్రముఖులు అక్కినేని స్వగృహానికి వెళ్ళి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరిగిన కార్యక్రమంలో కేక్‌ కట్‌ చేశారు. ఓ అభిమాని అక్కినేనిపై రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.

No comments: