- అసెంబ్లీ కార్యదర్శికి అందజేత
- కాంగ్రెస్ వాళ్లూ చేస్తారని ఆశిస్తున్నాం : ఎర్రబెల్లి
- కెసిఆరే అసలైన తెలంగాణ ద్రోహి
టిడిపి శాసనసభ్యులు తమ ఎమ్మెల్యే పదవులకు మళ్లీ రాజీనామాలు
చేశారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు 32 మంది దేశం ఎమ్మెల్యేలు తమ రాజీనామా
పత్రాలను అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారామ్కు అందజేశారు. గతంలో టిడిపి
శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలు భావోద్వేగంతో
కూడుకున్నవని ఆ రాజీనామాలను శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించిన
విషయం తెలిసిందే. అనంతరం సెప్టెంబర్ 28న మళ్లీ రాజీనామాలు చేస్తామని ఫోరం
ప్రకటించింది. దీనికి కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు కలిసి రావాలని
విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం టిడిపి శాసనసభా కార్యాలయంలో ఫోరం
సభ్యులు రాజీనామాలపై ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ
సుదీర్ఘంగా చర్చించించారు. సమావేశంలో ఎమ్మెల్యేలతోపాటు సీనియర్ నేతలు టి
దేవేందర్గౌడ్, కడియం శ్రీహరి, సంకినేని వెంకటేశ్వరరావు, వేం
నరేందర్రెడ్డి పాల్గొన్నారు. రాజీనామాలపై సమిష్టిగా, జిల్లాలవారీగా
సమావేశమై చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే తమ రాజీనామాపై నియోజక వర్గంలోని
ముఖ్యమైన కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. కాంగ్రెస్ కంటే
ముందు రాజీనామాలు చేయడాన్ని నలుగురు సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్రంగా
వ్యతిరేకించినట్లు తెలిసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసిన
తర్వాతే చేద్దాం.. అంతవరకూ వేచి చూద్దామని వారు సూచించినట్లు తెలిసింది.
కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీల శాసనసభ్యులు వచ్చిన తర్వాతే రాజీనామాలు
చేద్దామని ప్రకటించినా వారు ఇంత వరకూ రాలేదని, మన రాజీనామాల వల్ల ఆ రెండు
పార్టీలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ చర్చల
సారాంశాన్ని అనంతపురం పర్యటనలో ఉన్న పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుకు
ఫోన్లో వివరించినట్లు సమాచారం. ఆ తర్వాతే రాజీనామాలు చేయాలని తుది నిర్ణయం
తీసుకున్నట్లు నేతలు చెప్పారు. అనంతరం ఫోరం సభ్యులు మోత్కుపల్లి
నర్సింహులు, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎల్ రమణ, గంగుల కమలాకర్, పి రాములుతో
కలిసి కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ
రాష్ట్రం సాధిం చేందుకు ఉప ఎన్నికలే మార్గం కాదని, రాజ్యాంగ సంక్షోభం
సృష్టించడమే శరణ్య మన్నారు. ఈ అంశాన్ని ఉప ఎన్నికలు జరు గుతున్న
బాన్సువాడలో చెప్పేందుకు
గురువారం అక్కడికి వెళ్లనున్నట్లు
ఎర్రబెల్లి చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డితో ఎందుకు రాజీనామా చేయించారో,
ఎందుకు పోటీ చేయిస్తున్నారో కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్
చేశారు. ఎన్నికలతో రాజకీయ పార్టీలు బలపడేందుకు పోటీ చేస్తున్నాయని
కాంగ్రెస్, టిఆర్ఎస్నుద్దేశించి అన్నారు. ఉప ఎన్నికల్లో గెలిస్తే
తెలంగాణ ప్రజలకు ఒరిగేమీలేదన్నారు. ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు దిగొస్తాయని ఆయన చెప్పారు. రాజీనామాలు చేసేందుకు
కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలు వస్తాయని ఆశించామని, సాయంత్రం 6 గంటల వరకూ
వేచి చూసినా వారు రాకపోవడంతో తాము రాజీనామాలు చేశామన్నారు. అధికార
పార్టీకి చెందిన శాసనసభ్యులు రాజీనామాలు చేయడం ద్వారా రాజ్యాంగ సంక్షోభం
ఏర్పడుతుందని, తాము చేయడం ద్వారా ఉప ఎన్నికలు మాత్రమే వస్తామన్నారు.
తెలంగాణపై టిఆర్ఎస్ చాలా డ్రామాలు చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే విష్ణువర్థన్రెడ్డితో కలిసి
టిఆర్ఎస్ విలేకరుల సమావేశాలు పెడుతోందని విమర్శించారు. ఈ విషయాన్ని బట్టి
ఎవరు ఎవరితో మ్యాచ్ఫిక్సింగ్ చేసుకున్నారో తెలుస్తుందన్నారు. తెలంగాణలో
టిడిపిని నాశనం చేయాలని ఆ రెండు పార్టీలూ కుట్ర చేస్తున్నాయని
విమర్శించారు. కోమటిరెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా, వైఎస్ రాజశేఖరరెడ్డికి
తొత్తుగా పని చేశారని గుర్తు చేశారు. 'తెలంగాణ ఇప్పుడొస్తుంది.
అప్పుడొస్తుంది' అంటూ కెసిఆర్ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని
మండిపడ్డారు. తెలంగాణకు అసలైన ద్రోహి కెసిఆర్ అని విమర్శించారు.
No comments:
Post a Comment